Bilawal Bhutto Admits Pakistan’s Terror Link | పాకిస్థాన్ దేశ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మి ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నదనే సత్యం తెలిసిందే. గతంలో ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని పాక్ నేతలు చెప్పేవారు, కానీ తాజాగా మాత్రం వారు ఈ నిజాన్ని అంగీకరిస్తున్నారు.
పాకిస్థాన్కు ఉగ్రవాద సంస్థలతో గతంలో సంబంధాలు ఉన్నాయని, ఇది రహస్యం కాదని ఆ దేశ విదేశాంగ మాజీ మంత్రి, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇటీవల ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినట్లు అంగీకరించిన నేపథ్యంలో బిలావల్ ఈ వ్యాఖ్యలు చేశారు. “పాకిస్థాన్కు ఉగ్రవాద గ్రూపులతో గతంలో సంబంధాలు ఉండేవి. దీని ఫలితంగా మేము బాధపడ్డాం, పాకిస్థాన్ బాధపడింది. ఉగ్రవాదం వల్ల అనేక దఫాలుగా నష్టపోయాం,” అని బిలావల్ అన్నారు.
అయితే, గతంలో జరిగిన తప్పుల నుంచి పాకిస్థాన్ పాఠాలు నేర్చుకుందని, ఇప్పుడు ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అంతర్గత సంస్కరణలు చేపట్టిందని చెప్పారు. “ఇది మా చరిత్రలో దురదృష్టకరమైన భాగం, కానీ ఇప్పుడు మేము అలాంటి చర్యల్లో పాల్గొనడం లేదు,” అని పేర్కొన్నారు.
ఇకపోతే అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే వంటి చెత్త పనులు చేశామని పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థలతో ఉన్న బంధాన్ని అంగీకరించిన విషయం తెల్సిందే. కాగా జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ హస్తం ఉందని కథనాలు వస్తున్నాయి.