TTD Requests Devotees | ఈ నెల 30 వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకూ పది రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది.
అయితే తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలలోకి అనుమతి లేదంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
అది అసత్య ప్రచారమని తెలిపారు. శ్రీవారి భక్తులను తిరుమలకు రావొద్దంటూ చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మొదటి మూడు రోజులు అనగా, డిసెంబర్ 30, 31, జనవరి 1) ఈ-డిప్ ద్వారా టోకెన్లు కేటాయించామన్నారు.
ఈ మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. అయితే టోకెన్ లేకపోయినప్పటికీ తిరుమలకు భక్తులు రావచ్చని తెలిపారు. టోకెన్లు లేని వారికి జనవరి 2వ తేదీ నుంచి మిగతా అన్ని రోజులు సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు.








