Eatala Rajender News | తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ఈ మేరకు ఇలాంటి వార్తలను ప్రసారం చేయవద్దని కొన్ని మీడియా, వార్తా పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లకు ఈటల విజ్ఞప్తి చేశారు.
బురద చల్లి కడుక్కోమనటం బట్ట కాల్చి మీద వేయడం మంచిది కాదని హితవుపలికారు. తాను మాటలు మార్చే, పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని చెప్పారు. పార్టీ మారడం జీవితంలో గొప్ప నిర్ణయంగా ఉండాలి.. గొప్ప కారణం ఉండాలని పేర్కొన్నారు.
టిఆర్ఎస్ నుంచి కూడా బయటికి పంపిస్తే వచ్చాను తప్ప తనంతట తానుగా రాలేదని వివరణ ఇచ్చారు. తనను అక్కున చేర్చుకున్న పార్టీ బీజేపీ అని తెలిపారు. పార్టీ మారుతున్నానంటూ రాస్తున్న వార్తలను, చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నొక్కిచెప్పారు. పదే పదే శీల పరీక్ష చేయడం మంచిది కాదని, వ్యక్తిత్వ హననం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.









